Trilinga Swami Biography


త్రైలింగ స్వామి 

Trilinga Swami Biography





          ఆధ్యాత్మిక ధర్మభారాన్ని భరిస్తూ ప్రకాశిస్తున్న దేశం కనుక దీనికి భారతదేశం అని పేరు. "భా" అంటే బ్రహ్మతేజం, దానిలో రతులైన, అనగా క్రీడించే మహాత్ములుండే దేశం కనుక దీనికి భారతం అని పేరు. అంతటి మహోన్నతి కల్గిన ఈ భూమి వేదభూమి, జ్ఞానభూమి, కర్మభూమి, యోగభూమి, తపోభూమి, ధర్మభూమి అయిన ఈ ధర్మక్షేత్రంలో సనాతన కాలం నుండి ఆ బ్రహ్మతేజం యొక్క చైతన్యస్ఫూర్తిని కలిగిస్తున్న ఎందరో ఋషులు, సత్ గురువులు, బుద్దులు, సత్ పురుషులు జన్మిస్తూనే ఉన్నారు. అలాంటి వారిలో శ్రీ శ్రీ శ్రీ త్రైలింగ స్వామి ఒకరు.

          ఉత్తరాంధ్ర విజయనగరానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం 'కుమిలి' (కుంభాలపురం)(హాలియా) అనే ప్రాంతానికి అప్పటి రోజుల్లో నృసింహాధరుడు జమిందారుగా ఉండేవారు. ఆయన భార్య పేరు విద్యావతి. ఇద్దరు ఉదార హృదయులు. వారికీ సంతానం కలుగలేదు. వంశం నిలబెట్టుకోవాలన్న కోరికతో విద్యావతి కోరికమేర రెండో వివాహం చేసుకున్నారు నృసింహాధరుడు. 

          విద్యావతి మాత్రం కొన్నేళ్ళపాటు గౌరిశంకరుల వ్రతం చేస్తూ వచ్చింది. వ్రతంలో భాగంగా పన్నెండుమంది బ్రాహ్మణులకు సేవ కూడా చేసింది. వ్రతం పూర్తయిన రోజు ఆమెకొ కల వచ్చింది. ఆ కలలో ఓ తెల్లని ఏనుగు ఆమె దగ్గరకొచ్చి ఆమెలో ఐక్యమైనట్లు కనబడింది. 

          క్రీ. శ. 19.12.1607 పుష్యమాసం శుక్ల (ముక్కోటి) ఏకాదశి, రోహిణి నక్షత్ర శుభలగ్నంలో విద్యావతి దేవికి త్రైలింగస్వామి జన్మించారు. త్రైలింగస్వామికి తన తల్లి పెట్టిన ముద్దు పేరు శివరామ్. బిడ్డ జన్మించినా విద్యావతి గౌరిశంకరుల పూజ మానలేదు. ఓ రోజు శివలింగానికి అభిషేకం చేసి పూజిస్తున్న సమయంలో శివలింగం లోపల కాంతులీనుతున్న జ్యోతిరూపం కనబడింది. ఆమె ఆశ్చర్యంలో చూస్తుండగా ఆ జ్యోతి లింగం నుండి వెలువడి చెంతనే నిద్రిస్తున్న ఆ శిశివులో లీనమైంది. అద్భుతమైన ఆ దృశ్యం చూసి తన బిడ్డ కారణజన్ముడని అర్ధం చేసుకుంది.

          కొన్నాళ్ళకు నృసింహాధరుడి రెండో భార్యకు కొడుకు పుట్టాడు, ఆ పిల్లవాడి పేరు శ్రీధర్. కొడుకులిద్దరినీ రెండు కళ్ళుగా భావించి అల్లారుముద్దుగా పెంచారు. విద్యావతిదేవి ప్రతిరోజు శివారాధన చేసేది. శివరామ్ కూడా బాల్యంనుంచే తల్లితో కూర్చుని శివస్తోత్రాలు చదివేవాడు. ఆ సమయంలో భక్తిభావంతో అతని కళ్ళవెంట అశ్రువులు జారి చెంపలు తడిసిపోయేవి. బిడ్డ భక్తి భావానికి పొంగిపోయేది విద్యావతి. 

          శివరామ్ కి యుక్తవయసు వచ్చేనాటికి వివాహం చేయాలని తండ్రి ప్రయత్నించేసరికి, అప్పుడు శివరామ్ తన తల్లిదండ్రులతో "ఈ ప్రపంచం అనిత్యమైనది, ఇందులో సుఖం, స్థిరత్వం లేవు. అజ్ఞానంతో ఈ నశ్వరమైన జీవితాన్ని శాశ్వతమని భ్రమించి అత్యంత విలువైన మానవజన్మను వృధా చేసుకోవలసిన అవసరం లేదు. ఈ ప్రపంచ మాయాజాలంలో చిక్కుకుని సత్యమైన ఈశ్వరుని ఉపేక్షించడం ఎంత విచారకరం. నేను ఆయనను పొందే మహద్భాగ్యానికే నా జీవితాన్ని అంకితం చేయాలనీ అనుకుంటున్నాను. నా కోరిక సఫలం కావాలని నన్ను ఆశీర్వదించండి. నాకు వివాహ ప్రయత్నం తలపెట్టవద్దు, తమ్ముడు శ్రీధరకి వివాహం చేయండి" అని తల్లిదండ్రులకు వివరించి వారిని ఒప్పించారు.

          శివరామ్ కి 40 ఏళ్ళు వచ్చేసరికి వైరాగ్యం పూర్తిగా వంటబట్టి ఆధ్యాత్మిక సిద్దులు ప్రస్ఫుటమవసాగాయి. ఆ సమయంలో శివరామ్ తండ్రి నృసింహాధరుడు హఠాత్తుగా జబ్బుపడి కాలధర్మం చేసారు. ఆ తర్వాత మరో పన్నెండేళ్ళకు శివరామ్  తల్లి విద్యావతిదేవి కూడా మరణిస్తుంది. తనకి గురువు, దైవంగా వున్న తల్లి మరణం శివరామ్ మీద ఎంతో ప్రభావం చూపింది. తల్లి అంత్యక్రియలు జరిగినచోటే అతడికి అత్యంత పవిత్రమైనదిగా, పావనమైనదిగా కనిపిస్తుంది. అంతే... ఆ రోజు నుండి స్మశానంలో తల్లిని దహనం చేసినచోట నివాసం ఏర్పరుచుకుంటాడు. 

          క్రీ. శ. 1679 లో స్వగ్రామం విడిచి శివరామ్ తిరిగి తిరిగి పాటియాలా సంస్థానంలోని బస్తుర్ ప్రవేశించి, భగీరథస్వామి అనే యోగిపుంగవుణ్ణి సలుసుకుంటాడు. ఒకసారి ఇద్దరూ కలసి పుష్కరతీర్థానికి వెళ్తారు. ఆ పుణ్యతీర్థంలోనే భగీరథస్వామి శివరామ్ కి సన్యాస దీక్ష ఒసగి, గణపతిస్వామి అనే దీక్షానామం ఇచ్చారు. అప్పుడు శివరామ్ వయస్సు 78 ఏళ్ళు. 

          గురువుగారి ఆశ్రమంలోనే గణపతిస్వామి 10 ఏళ్ళకు పైగా సాధన చేసి అనేక అద్భుత శక్తులు గడించారు. క్రీ. శ. 1696 లో భగీరథస్వామి దేహం చాలించిన తర్వాత గణపతిస్వామి ఆశ్రమం విడిచి తీర్థయాత్రలు చేస్తూ 1697 లో సేతుబంధ రామేశ్వరం చేరుకుంటాడు. 

          రామేశ్వరం వీధుల్లో తిరుగుతుండగా గణపతిస్వామికి ఒక బ్రాహ్మణ బాలుని శవాన్ని స్మశానానికి తీసుకుపోతూ తల్లిదండ్రులు, బంధువులు దీనాతిదీనంగా విలపిస్తున్న దృశ్యం కనబడింది. ఆయన హృదయం ద్రవించి, శవానికి అడ్డం తిరిగి, కమండలం నుండి పుడిసెడు నీళ్ళు తీసి మంత్రించి శవంపై చల్లారు. వెంటనే ఆ బ్రాహ్మణ బాలుడు బ్రతికి లేచాడు. తల్లిదండ్రులు కన్నీటితో గణపతిస్వామి కాళ్ళు కడిగారు. చుట్టూమూగిన జనం గణపతిస్వామి సాక్షాత్తూ రామేశ్వరుడని కీర్తించారు. స్వామి మహిమలు రామేశ్వరం అంతటా తరంగాల్లా వ్యాపిస్తుండగా, ఉన్నట్లుండి ఆయన అక్కడి నుండి చల్లగా జారుకున్నారు.

          రెండు సంవత్సరాల తరువాత సుధామపురి చేరారు. అటునుండి 1701 సం. లో నేపాల్ అడవులలో తిరిగాడు. ఒకనాడు స్వామివారు హిమాలయ యాత్రలో ఉన్నప్పుడు నేపాల్ పశుపతినాథేశ్వరస్వామివారి ఆలయం వద్ద ఓ విచిత్ర సంఘటన జరిగింది. 

          నేపాల్ యువరాణి తన అంతఃపురంలో వున్న ప్రత్యేక తోటలోని సుగంధపరిమళాలతోకూడిన పూలను ఓ పెద్దమాలగా చేసి పశుపతినాథేశ్వరునికి సమర్పించాలని చెలికత్తెలతో వెళ్తుండగా, కోవెల మెట్లమీద దిగంబరంగా వున్న గణపతిస్వామి కనబడతాడు. "నన్ను పెళ్లి చేసుకుంటావా" అని స్వామి అడుగుతాడు కూడా. పశుపతినాథేశ్వరస్వామికి తను తెచ్చిన పూలమాలను వేసి తిరిగివస్తుండగా, మెట్లమీద కూర్చున్న గణపతిస్వామి మెడలో ఆ దండ కనబడుతుంది. తను తెచ్చిన దండ స్వామి వారి మెడలో ఎలా వచ్చిందో అర్ధంకాక స్వామి వారి పాదాలను ఆశ్రయిస్తుంది. "నీకు నచ్చిన వరుడు లభిస్తాడు" అని స్వామి ఆశీర్వదిస్తారు. 

          నేపాల్ అడవుల్లో కాయకసరులు తింటూ గణపతిస్వామి తపస్సు చేస్తుండగా ఒక అద్భుతం జరిగింది. ఒక రాజబంధువు ఆ అడవికి పులివేటకై వచ్చాడు. తుపాకీ దెబ్బ తప్పించుకున్న పులి పరుగెత్తిపోయి తపోమగ్నులైన గణపతిస్వామి పాదాల వద్ద కూర్చుంది. పులిని వెంటాడుతూ వచ్చిన రాజబంధువు ఆ దృశ్యం చూచి స్తంభించిపోయాడు. అతణ్ణి చూసి పులి గాండ్రించింది. ఆ ధ్వనికి తపోభంగమైన స్వామి కనులు తెరిచి చేయెత్తారు. ఆ ఎత్తిన చేయి పులికి అభయహస్తం కాగా, వేటగానికి పులిని చంపవద్దని ఆజ్ఞాహస్తం అయింది. జీవం పోయలేని వారికీ జీవిని చంపే అధికారం లేదని స్వామి వారి హితబోధ. ఆ రాజబంధువు తిరిగిపోయి నేపాల్ రాజుకు ఈ వింత చెప్పాడు. మహారాజు ఖాట్మండు నుండి తరలి వచ్చి స్వామికి సాగిలపడి కానుకలు ఇవ్వజూపాడు. స్వామి ఆ బహుమతులను ముట్టలేదు. జీవహింస కూడదని చెప్పి, దీక్ష ఇచ్చి, మహారాజును సాగనంపారు. గణపతిస్వామి గురించి అద్భుతవార్తలు రాజభటుల ద్వారా సామాన్యజనం విని తండోపతండాలుగా అడవికి రాసాగారు. 

          ఏకాంతానికి భంగం కలగడంతో గణపతిస్వామి ఆ ప్రదేశం విడిచి, 1707లో త్రివిష్ణవం చేరుకుంటారు. అక్కడ పలుచోట్ల యాగసాధన చేశారు. 1710లో స్వామిజీ మానససరోవరం వెళ్లారు. అక్కడ చాలాకాలం సాధనలో వున్నారు.

          ఒకరోజు పాము కాటుకు బలైపోయిన అయిదేళ్ళ కొడుకు శవాన్ని ఒడిలో పెట్టుకోని ఓ వితంతువు కరుణార్ధ్రంగా విలపించసాగింది. అది చూసిన గణపతిస్వామి ఆ తల్లిని సమీపించి, తమ పవిత్ర స్పర్శతో బాలుణ్ణి పునర్జీవితుణ్ణి చేశారు. ఆ అద్భుతం చూసిన జనం స్వామిని చుట్టుముట్టి, జేజేలు కొట్టసాగారు. స్వామి అదృశ్యులై కోడలోయల్లో సాగిపోతూ కనపడ్డారు. 

          గణపతిస్వామి నర్మదానదీ తీరంలోని మార్కండేయ ఋషి ఆశ్రమంలో ఉన్నప్పుడు ఖాకి బాబా అనే మహాత్ముడు అక్కడే ఉండేవారు. ఓ రోజు ఆయన నర్మదా నదీతీరంలో యోగాభ్యాసం చేస్తుండగా గణపతిస్వామి అక్కడికి వచ్చి నదిలో నీళ్ళు తాగుతుండగా ఆ నీళ్ళన్నీ పాలుగా మారాయి. ఖాకి బాబా ఆశ్చర్యంతో తాను కూడా ఆ పాలు త్రాగబోయేసరికి అవి యధాతథంగా నీళ్ళుగా మారడం చూసి మరింత ఆశ్చర్యానికి గురవుతారు. 

          మరోసారి స్వామి ప్రయాగదామ్ వచ్చి యోగసాధన చేస్తుండగా ప్రయాణికులతో నిండివున్న ఒక నావ మునిగిపోతుండగా క్షణంలో ఆ నావలో చేరి దానిని పైకి లేపి ఒడ్డుకు చేర్చారు. 

          ప్రయాగక్షేత్రంలో నాలుగు సంవత్సరాలు గడిపాక క్రీ. శ. 1737లో అనగా 130 సంవత్సరాల వయసులో పండితరాజులకు, యోగి రాజులకు పరీక్షా స్థానం అయిన, పరమ శివుని ఆవాసభూమి, ఆనందకాననం అయిన కాశీ కి వచ్చి ఆ పట్టణంలో మరో 150 ఏళ్ళు సంచరించారు. అక్కడి కాశీ ప్రజలు గణపతిస్వామిని త్రిలింగ ప్రాంతంగా పిలిచే తెలుగు ప్రాంతం నుంచి వచ్చినవారు కనుక  త్రైలింగస్వామి గా పిలిచేవారు. 

          త్రైలింగస్వామి వారు అనేక తావుల్లో, గంగాఘట్టాల్లో యోగసాధన చేశారు. 300పౌన్ల బరువు, దీర్ఘకాయంతో, దిసమొలతో, మేడలో పెద్ద రుద్రాక్ష మాలతో,  కుండబొజ్జతో కాశీ వీథుల్లో ఆయన తిరుగుతుంటే స్వామిని 'సచల విశ్వనాథు'డనేవారు. గంటల తరబడి గంగా తరంగాల పైన స్వామి రాజహంసలా తేలియాడేవారు. జాములకొద్దీ ఆ నదీమతల్లి గర్భంలో మునిగి ఉండేవారు. జనమంతా గంగా ఒడ్డున నిలబడి, స్వామిని దర్శించేవారు. 

          కాశీలో ఒక మహారాష్ట్ర  స్త్రీ రోగగ్రస్తుడైన భర్తతో ఉంటూ, అతని ఆరోగ్యం కోసం అనుదినం కాశీవిశ్వేశ్వరునికి అభిషేకం చేసి వస్తుండేది. కొత్తగా వచ్చిన ఈ దిగంబర సన్యాసిని చూసి ఆమె అసహ్యించుకుంది. దిగంబరంగా ఉండేవాడవు అడవుల్లో ఉండక, జనుల మధ్య, అందులోనూ  స్త్రీల ఎదుట ఎందుకు తిరుగుతున్నావని తూలనాడింది. స్వామి పట్టించుకోలేదు. విశ్వేశ్వరుడు ఆమె కలలో కనబడి, 'దిగంబరస్వామిని ఆశ్రయిస్తేనే నీ భర్త రోగం నయమవుతుంది' అన్నాడు. ఇగ ఆమె గత్యంతరం లేక తాను తూలనాడిన దిగంబర సన్యాసినే ఆశ్రయించి, క్షమాభిక్ష వేడింది. తన భర్త ప్రాణాలు రక్షించమని ప్రార్ధించింది. ఆమె దీనాలాపాలకు స్వామి కరిగిపోయి, విభూతి ప్రసాదమిచ్చారు దానితో ఆమె భర్త రోగం మటుమాయమైపోయింది.

          ఓసారి కాశీవాసులకు, పాలు, పెరుగు కోరతావచ్చాయి. కారణం అక్కడి ఆవులకు ఏదో అంటువ్యాధి సోకింది. అప్పుడు త్రైలింగస్వామి ఒక వసారాలో రెండు మట్టి పిడతలు పెట్టి వాటిని అక్షయం చేసేశారు. ఒకదాంట్లో పాలు, ఒకదాంట్లో పెరుగు వచ్చినవారందరికి పంచిపెట్టేవారు. ఖాళీ కాగానే అవి రెండూ మళ్ళి వెంటనే నిండేవి. ఆయన మహిమకు ప్రజలంతా విస్తుపోయారు. 


          స్వామిజీ దిగంబరంగా తిరుగుతుంటే పోలీసులు అరెస్టుచేసి జైలులో పెట్టారు. అప్పుడు స్వామిజీ మాయమై జైలు పైకప్పుపైన ప్రత్యక్షమైనారు. జైలు గది తాళాలు వేసినవి వేసినట్లే ఉన్నాయి. పోలీసులు మళ్ళి ఆయన మహిమ చూసేందుకు నిర్బంధించారు. తిరిగి అలానే మాయమై పైకప్పుపైన ప్రత్యక్షమయ్యారు. కొద్దిసేపటికి స్వామిజి మహిమ తెలుసుకొని వారిని దేనితోనూ బంధించలేమని అర్థంచేసుకొని స్వామివారి జోలికి వెళ్ళేవారుకాదు.

          త్రైలింగస్వామి వారణాసిలోని అసి ఘాట్, హనుమాన్ ఘాట్, వేదవ్యాస ఆశ్రమం, దశాశ్వమేధ్ ఘాట్ వంటి ప్రాంతాల్లో జీవించారు. ఆ తరువాత స్వామి దశాశ్వమేధ్ ఘాట్ నుండి 1800లో తమ బస పంచగంగా ఘాట్ లోని బింధుమాధవుకు మార్చారు. ఆనాటి నుండి మహాసమాధి పర్యంతం మౌనవ్రతం పాటించారు. స్వామి తన అవసరాల కోసం గానీ, ఇతరుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి గానీ సైగలు చేసేవారు. అందువల్ల కొందరు ఆయనను 'మౌన బాబా' అని పిలిచేవారు. 

          త్రైలింగస్వామి చాలా అంటే చాలా తక్కువ ఆహరం తీసుకునేవారు, రోజులతరబడి ఉపవాసదీక్ష లో ఉండేవారు. ఉపవాసదీక్షను భక్తులు ఇచ్చిన పెరుగు లేదా మజ్జిగను పుచ్చుకొని విరమించేవారు. ఒకనాడు ఒక దుష్టుడు శ్రీ త్రైలింగస్వామిని పరీక్షించదలచి మజ్జిగ అని చెప్పి ఒక బకెట్ నిండా సున్నం కలిపిన నీళ్ళను స్వామికి ఇచ్చాడు. స్వామిజీ ఆ నీటిని త్రాగేసి ఆ దుష్టుడి ముందే నీళ్లు, సున్నం వేరుచేస్తూ లఘుశంకద్వారా విసర్జించారు. సున్నపునీరు ఇచ్చిన వ్యక్తి ఒళ్ళంతా మంటలతో బాధను అనుభవిస్తూ స్వామివారి పాదాలమీదపడి క్షమాపణ కోరడంతో అతన్ని అనుగ్రహించారు స్వామి.

          ఒకసారి ఆ పట్టణంలో ఉంటున్న కొందరు ఆంగ్లేయులు, వారి భార్యలు వెళ్ళి కాశీ మేజిస్ట్రేటుకు ఫిర్యాదు చేసారు స్వామిజి దిగంబరంగా తిరుగుతున్నారని. ఆ మేజిస్ట్రేటు కూడా ఆంగ్లేయుడే. స్వామిని పట్టి కోర్టుకు తేవలసిందిగా ఆయన పోలీసులను ఆదేశించాడు. పోలీసులు స్వామిని పట్టి బలవంతంగా కోర్టుకు తీసుకువచ్చారు. స్వామి ఆ చర్యకు ఉల్కలేదు, పలకలేదు. కోర్టులో ప్లీడరు, న్యాయాధీశుడు అడిగిన ప్రశ్నలకు స్వామి జవాబు చెప్పలేదు. స్వామిని ఎరిగిన సబ్ మేజిస్ట్రేట్, కొందరు ప్లీడర్లు వారి మహిమలు చెప్పారు. స్వామి నిర్వికారులని, సర్వ సమదృష్టి కలవారని, దేహబుద్ధి లేనివారనీ చెప్పారు. మేజిస్ట్రేటు అంతా విని, తాను తినే మాంసాహారం స్వామి తింటాడా అని ప్రశ్నించాడు. స్వామి అతను తినే మాంసాహారం తింటామనీ, కానీ తాము తినే ఆహరం మేజిస్ట్రేటు తింటారా అంటూ సైగలు చేశారు. ఆ వెంటనే బర్రుమనే ధ్వనితో తమ చేతిలోనే మలవిసర్జన చేసి, మేజిస్ట్రేటుకు చూపుతూ నోట్లో వేసుకున్నారు. ఆ దృశ్యం చుసిన మేజిస్ట్రేటుకు మతి పోయినంత పని అయింది. అయితే స్వామి మలవిసర్జన కార్యంతో కోర్టు అంతా పచ్చి గంధపు పరిమళం వ్యాపించింది. స్వామి మహత్తు కన్నులారా చూసిన మేజిస్ట్రేటు ప్రభావితుడై, త్రైలింగస్వామి కాశీపట్టణ వీథుల్లో స్వేచ్ఛగా తిరుగవచ్చుననీ వారిని ఎవరూ అడ్డుపెట్టరాదనీ ఉత్తర్వు జారీ చేశాడు. 

          ఒకనాడు విజయనగరం రాజుగారి ప్రాసాదం ముందు నుండి స్వామి పోతున్నారు. ఆయనను చుసిన రాజు, స్వామిని ఆభరణాలతో అలంకరించి సాగనంపారు. స్వామి బయటకు రాగానే కొందరు దొంగలు ఆ వస్తువులు, వస్త్రాలు దోచుకొని పారిపోయారు. వెంటనే రాజు వారిని పట్టి తెప్పించి, స్వామి ముందు నిలబెట్టి "వీరికేమి శిక్ష" అని అడిగారు. "క్షమాయే శిక్ష" అని త్రైలింగస్వామి బదులిచ్చారు. 

          కాశీలో శ్రీ త్రైలింగస్వామి 'లాట్' అనే ఒక రాతి శివలింగాన్ని బాలాజీ ఘాట్ కి దక్షిణంవైపు ఘాట్ మీద ప్రతిష్టింపచేశారు. వర్షాకాలమంతా అది గంగలో కలసిపోయి కనపడదు. మిగతా కాలంలో ఇప్పటికి దాన్ని చూడవచ్చు. ఇదికాక స్వామిజీ తను ఉండే ఆశ్రమంలో "త్రైలింగేశ్వరశివ" అనే పేరుతొ ఒక శివలింగాన్ని స్థాపించారు. దీనిని స్వామిజీ గంగలోనుండి  బయటకు తీసి, స్వయంగా తానొక్కడే తన ఆశ్రమంకు తీసుకువచ్చారు. ఈ శివలింగం దాదాపుగా 200కే. జీ. ల బరువు ఉంటుంది.  ఈ శివలింగానికి ఇప్పటికి భక్తులు అభిషేకాలు, పూజలు చేస్తున్నారు. మంగళకాళీ అనే దేవీప్రతిమను కూడా ఆశ్రమంలో స్థాపించారు. 

          స్వామిజీ సాధనా స్థానంలో గోడకు ఒక చిన్న గూడువంటిది ఉంది, అందులో చేయిపెట్టి స్వామిజీ తన భక్తులు కోరిన వస్తువులను తీసి ఇస్తుండేవారు. అంత చిన్న జాగాలో నుండి అంత పెద్ద వస్తువులు ఎలా తీసేవారన్నది ఒక ఆశ్చర్యకరమైన రహస్యం. ఆ గూడు ఇప్పటికి చెక్కుచెదరకుండా అలాగే ఉంది. 

          క్రీ. శ. 1867లో శ్రీ రామకృష్ణపరమహంస కాశీ యాత్రకు వచ్చి శ్రీ త్రైలింగస్వామిని మొదటిసారిగా కలిసినప్పుడు "సాక్షాత్ విశ్వనాథుడే వీరిలో కొలువైవున్నాడు. యోగసాధనతో అత్యున్నత స్థానాన్ని పొందివున్నారు. వీరికి తన శరీరం గురించిన ధ్యాస లేదు, ఎండా, వానా, చలి ఏవి కూడా వీరి మీద తమ ప్రభావం చూపలేవు. మిట్టమధ్యాహ్నం రోహిణీకార్తె ఎండల్లో కూడా కాలే ఇసుకలో నిశ్చింతగా పడుకునివుంటారు. వీరిలో పరమహంస యొక్క సంపూర్ణ చిహ్నాలు ఉన్నాయి. వీరు కాశీలోని 'సచల విశ్వనాథుడు '. వీరు ఇక్కడ తమ నివాసం ఏర్పరుచుకోవడం వల్ల కాశీకి మరింత గౌరవం పెరిగింది. వీరి దర్శనంతో విశ్వనాథుడిని దర్శించాలన్న కోరిక తీరిపోయింది" అని శ్రీ రామకృష్ణ పరమహంస త్రైలింగస్వామిని కీర్తించారు. 

          ఓ రోజు శ్రీ రామకృష్ణ పరమహంస పన్నెండు కిలోల పాయసాన్ని వండించి, తీసుకుపోయి స్వహస్తాలతో శ్రీ త్రైలింగస్వామికి తినిపించారు. అలా చేయడంవల్ల ఆయనకు అంతులేని ఆనందం కలిగిందట. 

          శ్రీ రామకృష్ణ పరమహంసతో పాటు పలువురు సాధువులు ఆయనను కలిసి, ఆయన విశేషాలను అభివర్ణించారు. అటువంటివారిలో లోకనాథ్ బ్రహ్మచారి, బెనమాధవ బ్రహ్మచారి, భగబాన్ గంగూలీ, స్వామి వివేకానంద, మహేంద్రనాథ్ గుప్త, లాహిరి మహాశయులు, స్వామి అభేదనంద, భాస్కరానంద, విశుద్ధానంద, విజయకృష్ణ మొదలైనవారు ఉన్నారు. 

          త్రైలింగస్వామి అవతారం చాలించిన ఘట్టం కూడా అద్భుతమైనదే. స్వామి జీవిత చరిత్ర రచయితా ఉమాచరణ ముఖోపాధ్యాయకు ఆరేళ్ళ ముందే స్వామి తాము దేహం చాలించే విషయం చెప్పారు. ఆరేళ్ళ తరువాత ఒకనాడు స్వామి గంటల తరబడి గంగా విహారం మనసారా చేసి వచ్చి, ఉన్నట్లుండి తాము దేహం చాలిస్తున్నామని, ఈ దేహానికి వీడ్కోలు చెప్పండని అనుచరులతో అన్నారు. 

          స్వామిని సేవించే మంగళదాస్ అనే భక్తుడు కన్నీరుమున్నీరై విలపించాడు. భావితరాల భక్తుల పూజల కోసం స్వామివారి రాతి విగ్రహం చేయించుకోవడానికై మరికొంత వ్యవధి ఇవ్వాల్సిందిగా ప్రార్థించాడు. స్వామి అతని కోరికను మన్నించి నెలరోజులు గడువు ఇచ్చారు. 

          మహా సమాధికి పది రోజుల ముందు స్వామి పంచగంగా ఘాట్ లో ఒక స్థలం ఎంపికచేసి, చిన్న భూగృహం నిర్మింపజేసుకున్నారు. పదోరోజు ఉదయం భూగృహంలోకిపోయి తలుపు వేసుకొని, మధ్యాహ్నం 3 గంటల దాకా స్వామి యోగ సమాధిలో ఉండి, భూగృహం నుండి బయటికి వచ్చి, అందరికి వీడ్కోలు చెప్పి హితోపదేశం సైగలతోనే చేశారు. హారతులు అందుకున్నారు.  త్రైలింగస్వామి దశనామి సంప్రదాయానికి చెందిన సాధువులు కావున వారి సలిలసమాధి చేసే విధానం వివరించారు. 

          క్రీ. శ. 26. 12. 1887 పుష్యశుక్ల ఏకాదశి (ముక్కోటి ఏకాదశి) సాయంకాలం ఓ చెక్క పెట్టెలో పద్మాసనంలో కూర్చుని సమాధిస్థితిలోకి వెళ్లారు. ఎందరో భక్తులు ఘాట్లలో హాజరై ఉండగా గంగామధ్యలోకి ఆ చెక్క పెట్టను పడవలో తెచ్చి వదిలారు. ఆ చెక్క పెట్టె కొంతసేపు ఆ నీటి పైన తేలుతూ ఉండి, ఆ తరువాత గంగలోకి వెళ్ళిపోయింది. కొంతసమయానికి ఆ చెక్కపెట్ట తేలుతూ పైకి వచ్చింది. కొందరు శిష్యులు స్వామీజీని ఓ మారు దర్శించేందుకు ఆ పెట్టెను తెరిచి చుస్తే ఆయన అందులో లేరు. అలా శ్రీ త్రైలింగస్వామి స్థూల శరీరం అంతర్థానమైంది.  ఇప్పటికి కాశీలో త్రైలింగస్వామి భక్తుల మధ్య తిరుగాడుతూనే ఉంటారన్నది ప్రతిఒక్కరు నమ్మే సత్యం. 

          త్రిలింగస్వామి ఏర్పాటుచేసుకున్న భూగృహం పైన స్వామివారి నల్లరాతి విగ్రహం ప్రతిష్టించారు. నేటికీ ఆ భూగృహం, ఆయన విగ్రహం దర్శించవచ్చు. 

          శ్రీ త్రైలింగస్వామి వారి జీవనంలోని ఇంకెన్నో మహాత్యాల గురించి తెలుసుకోవాలనుకుంటే వారి జీవిత చరిత్ర చదవలసిందే. 

          ఈ సారి కాశీకి వెళ్ళినప్పుడు ఒకసారి శ్రీ త్రైలింగస్వామి ఆశ్రమంకు వెళ్లి వారిని దర్శించి వారి కరుణ, కటాక్షాలను పొందండి. 

Trilinga Swami Biography వీడియో చూడండి.

మరిన్ని వీడియోల కోసం KUSUMA Creations Youtube Channel ను Subscribe చేసుకోండి. 

KUSUMA Creations YouTube channel is a part of Bharatsahajavaani.
 
KUSUMA Creations YouTube channel is an online Bharat Sahaja Vaani of Dhamma Marg education platform, specialized in what is the dharma, Spiritual Gurus introduction, Spiritual right path and Health tips 



భవతు సర్వ మంగళం


      ఇంకా ఇవి కూడా చదవండి ... 
పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరీ 

Swami Samarth Akkalkot Maharaj 

ఇంకా వీక్షించండి ... 


  

          

          

         

                

కామెంట్‌లు