Specificity of Sheelasampada

Specificity of Sheelasampada
శీలసంపద యొక్క విశిష్టత
 మహాభారతం లోని కథ

 

          ఖాండవవన దహనమప్పుడు లోకైకవీరుడైన అర్జునుడు తనను రక్షించినందుకు కృతజ్ఞతగా మాయాసురుడు మయసభను నిర్మించి ధర్మరాజుకివ్వాలని సంకల్పించుకున్నాడు. మాయాసురుడు ఆ భవ్య మయసభను పవిత్ర హిమాలయాలలో నిర్మించి తన మాయశక్తితో ఇంద్రప్రస్థానికి తెచ్చాడు. మయసభలోని అద్భుతాలను పొగడటానికి మాటలుచాలావు. మయసభ అంతా కనక రత్న మణిమయము. మయసభలోని స్తంభాలు ద్వారాలు తోరణాలు వనాలు తటాకాలు అన్ని మణిమయాలే. రాజసూయ యాగానికి వచ్చిన అందరికి సంభ్రమాశ్చర్యాలు కలిగించి నభూతో నభవిష్యతి అని పొగడబడినది ఆ మయసభ. మయసభ విభవం పాండవుల అదృష్టం చూసి దుర్యోధనుని అసూయామాత్సర్యాలు మరింత చెలరేగాయి. పాండవుల కీర్తి సంపదలను తలచుకొని తీవ్రంగా దుఃఖిస్తూ తన తండ్రి అయిన ధృతరాష్ట్రుని వద్దకు వచ్చి తన బాధను చెప్పుకున్నాడు దుర్యోధనుడు. మత్సరమనే ఘోరసర్పముచే కాటువేయబడ్డ తన కొడుకుకి ఇలా హితవు చెప్పాడు ధృతరాష్రుడు.

          "కుమారా! నీకు మాత్రం తక్కువ ఐశ్వర్యమున్నదా? ఈ లోకంలో సంతృప్తి ఉన్నవాడే ధనవంతుడు. సంతృప్తి లేకుండా కుబేర సంపద ఉన్నా వాడు సంతోషముగా ఉండలేడు. నాయనా! శీలవంతుడైన ధర్మనందనుని శ్రీలక్ష్మి ఎన్నడూ విడువదు. శీలవంతుని ఆశ్రయించే సకల సంపదలు సుగుణములు ఉంటాయి. కాబట్టి నీవు కూడా ధర్మాత్ములైన పాండవులవలె శీలవంతుడవు కమ్ము, దానితో సిరిసంపదలు వాటంతట అవే వస్తాయి". అని కుమారునికి ఒక ఇతిహాసం చెప్పాడు.

           "ప్రహ్లాదుడు సర్వగుణ సంపన్నుడు విద్యా పారంగతుడు పరమ విష్ణుభక్తుడు. ధర్మం తప్పకుండా తన ప్రజలను పాలించేవాడు. తన సౌశీల్య ప్రభావం చేత త్రిలోకాధిపత్యం ఇంద్రత్వం ప్రాప్తించింది ప్రహ్లాదునికి. చతుర్భువనాలను జనరంజకముగా పాలించసాగాడు ఆ ప్రహ్లాదుడు. ఇలా ప్రహ్లాదుని వలన పదవీ భ్రష్టుడైన శచీపతి, గురువైన బృహస్పతులవారిని తనకు మళ్ళి ఇంద్రపదవి సిద్ధించే ఉపాయం చెప్పమని ప్రార్ధించాడు. బృహస్పతి విష్ణు అవతారుడైన పరశురాముని  ఆశ్రయించమని చెప్పాడు. గురు ఆజ్ఞపాటించి ఇంద్రుడు భార్గవరాముని శరణుజొచ్చి ఉపాయం భోదించమని ప్రార్ధించాడు. "అతనికి అంత శక్తి ఎలా వచ్చిందో అతనినే అడుగు, ఆ శక్తిని అతనివద్దనుండి పుచ్చుకో" అని చెప్పాడు భార్గవుడు.

          విద్యార్జన గురుసుశ్రూష వలెనే సాధ్యం అని తెలిసిన దేవేంద్రుడు విప్రవేషం ధరించి ప్రహ్లాదునికి శిష్యుడై అతనిని భక్తితో సేవించటం మొదలుపెట్టాడు. అలా ఎంతో కాలం ప్రహ్లాదుని సేవించినాడు. ప్రసన్నుడైన ప్రహ్లాదుడు "నాయనా! ఏమి కోరి నన్ను సేవిస్తున్నావు?" అని విప్రవేషంలో ఉన్న ఇంద్రుని అడిగాడు. శచీపతి తన అభీష్టం వ్యక్తపరచినాడు. అప్పుడు ప్రహ్లాదుడు

          "కుమారా ! నేనెప్పుడూ రాజునని గర్వించను. ఎవరిని నొప్పించను. వారికీ హితమేచేస్తాను. ఈర్ష, అసూయ, ద్వేషం, పగ మొదలైనవి నా దరి చేరనివ్వను, అడిగినవాడికి లేదనకుండా సంతోషపెడతాను. నా పురాకృత పుణ్యం వలన నాకీ సౌశీల్యం అబ్బినది" అని చెప్పాడు. "ఓ దయామయా! దానశీలా! నీ శీలం నాకు ప్రసాదించు" అని అడిగాడు ఇంద్రుడు. "అయ్యో పాపం!" అని ప్రహ్లాదుడు తన శీలాన్ని దేవేంద్రునికి దానం ఇచ్చి పంపివేశాడు.

          ఇంద్రుడు వెళ్ళాడో లేదో ప్రహ్లాదునిలోనుండి ఒక దివ్య తేజఃపుంజము పురుషాకృతిదాల్చి బయటికి వచ్చింది. "నీవెవరు?" అని ఆశ్చర్యముగా అడిగాడు ప్రహ్లాదుడు. "నేను నీ శీలాన్ని. ఆ విప్రునికి నన్ను దానం ఇచ్చావు కదా, వెళుతున్నాను" అని చెప్పి వెళ్ళిపోయింది శీలము. ఒక తేజస్సు తరువాత ఒకటి ప్రహ్లాదుని విడిపోయినాయి. ఒక తేజస్సు అన్నది, "నేను సత్యమ్. శీలాన్ని ఆశ్రయించి ఉంటాను. శీలంతో పాటూ నేను నిన్ను విడుస్తున్నాను". మరొక తేజస్సు అన్నది, "రాజా! నేను ఋజుప్రవర్తనమ్. సత్యము లేని చోట నేనుండలేను". మరో తేజస్సు అన్నది, "నేను బలమ్. సత్ర్పవర్తన లేనివాడి వద్ద నేనుండను" అని వెళ్ళిపోయింది బలమ్. చివరికి ఆదిలక్ష్మీ బయటికి వచ్చి, "నేను శ్రీలక్ష్మిని. బలం ఉన్నచోట నేనుంటాను, వెళుతున్నాను" అని అన్నది. అప్పుడు ప్రహ్లాదుడు "అమ్మా! లోకమాతా! నీవూ నన్ను విడిచిపోతున్నావా? ఈ అభాగ్యునిపై దయ చూపవా? వెళ్ళద్దు తల్లి! ఆ విప్రుడు ఎవరు తల్లి?" అని ప్రార్ధించాడు. "అతడు దేవేంద్రుడు, పోగొట్టుకున్న రాజ్యమును సంపాదించడానికి నీవద్దకు వచ్చాడు. అన్ని సంపదలకూ మూలమైన శీలమును నీవు అతనికి దానమిచ్చావు కావున శీలాన్ని అనుసరించి మేమందరమూ వెళుతున్నాము" అని సర్వాణి చెప్పింది. నిజమైన శ్రీహరి భక్తులకు సాధ్యం కానిదేమున్నది? ప్రహ్లాదుడు మళ్ళి తన సద్గుణాలను సంపదలను అచిరకాలంలోనే సంపాదించుకున్నాడు. కనుక నీవెల్లప్పుడూ సౌశీల్యుడవై వర్ధిల్లు నాయనా!" అని కుమారునికి హితవు చెప్పాడు ధృతరాష్ట్రుడు.

ధర్మం :

          సౌశీల్యం యొక్క ప్రాముఖ్యత మనకీ కథ ద్వారా తెలుస్తుంది. శీలమున్న వాడి వద్దనే సకల సంపదలుంటాయి, కాబట్టి మొదట శీలవంతులము కావడం ముఖ్యము.


భవతు సర్వ మంగళం

కామెంట్‌లు