God is Watching


దేవుడు చూస్తున్నాడు

God is Watching

 

          ధర్మ బద్దంగా జీవించాలి, ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అని చెబుతుంటారు. అసలు ధర్మం అంటే ఏమిటి? అని అడుగుతే మాత్రం సాంప్రదాయాన్ని చూపెట్టి ఇదే ధర్మం అని అంటారు. కానీ దీన్ని నిశితంగా పరిశీలిస్తే సాంప్రదాయం, ధర్మం ఒకటి కాదని అర్ధం అవుతుంది. ధర్మం ను అనుసరించాలంటే, దాన్ని పాటించాలంటే కొన్ని ప్రాధమిక నియమాలు ఉన్నాయి వాటిని అనుసరించాలి. అందులోని ఒకదాని గురించి ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాం... 

          రాజాపురం గ్రామంలో భూపతి అనే రైతు ఉండేవాడు. అతను వ్యవసాయం చేసి జీవించేవాడు. భూపతికి కిష్టయ్య అనే కొడుకు ఉన్నాడు. ప్రతిరోజు తండ్రి పొలం నుంచి వచ్చేవరకు నిద్రపోకుండా ఉండేవాడు. ఎందుకంటే నిద్రపోయేటప్పుడు భూపతి కొడుకుకి ఏదో ఒక కథ చెప్తాడు. అది వింటేనే కానీ కిష్టయ్య నిద్రపోయేవాడు కాదు. 

           ఒకరోజు భూపతి కొడుకుకి కథ చెబుతూ.. "ఈ సృష్టికి మూలమైన దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు. మనం ఈ విషయాన్నీ ఎప్పుడూ మరిచిపోకూడదు" అని చెప్పాడు. 

          కిష్టయ్య అటూ ఇటూ తొంగిచూసి "నాన్నా ! భగవంతుడు ఉన్నాడన్నావు. అన్నిచోట్లా ఉన్నాడా? మరి! నాకెక్కడ కనిపించటంలేదే !?" అన్నాడు ఆశ్చర్యంగా. 

         "కిష్టయ్యా! భగవంతుడు మన కళ్ళకి కనిపించడు. ఆయన్ని చూడాలంటే మనం ఎంతో పుణ్యం చేయాలి. అయితే ఆయన మనం చేసే పనులన్నీ గమనిస్తూ ఉంటాడు" అని భూపతి చెప్పాడు. 

          తండ్రి చెప్పిన మాటలు కిష్టయ్య మనసులో బాగా నాటుకుపోయాయి. ఇలా కాలం గడుస్తుండగా... ఆ సంవత్సరం వర్షాలు సరిగ్గా కురవక భూపతి పొలంలోని పంట దెబ్బతింది. కుటుంబ పోషణ కష్టంగా ఉన్న పరిస్థితిలో భూపతి ఒకరోజు రాత్రి కిష్టయ్యను ఊరవతలి పొలంలోకి తీసుకెళ్లాడు. ఆ పొలం మరో రైతుది. అతని పొలంలో బోరింగ్ పంపు ఉండటం వల్ల పంట బాగా పండింది. ఆ పంటలోని కొంతభాగాన్ని దొంగతనంగా తీసుకురావాలని భావించాడు భూపతి. తన కొడుకుని గట్టుపై కాపలా పెట్టి, "చూడు బాబూ! ఎవరైనా చూస్తున్నారేమో నాలుగుదిక్కులు గమనించి నాకు చెప్పు, నేను గబగబ కొంత పంట తీసుకొస్తాను" అన్నాడు. 

          భూపతి పొలంలోకి వెళ్లి పంటను కోయటం మొదలుపెట్టగానే "నాన్నా ఆగు!" అన్నాడు కిష్టయ్య. 
          "ఎవరైనా చూస్తున్నారా ఏం ?" అని భూపతి అడిగాడు. 
          "అవును నాన్నా! చూస్తున్నారు అని అన్నాడు కిష్టయ్య."

          భూపతి పొలంలోనించి బయటకు వచ్చాడు. అక్కడ ఎవరూ కనిపించలేదు. "ఎవరూ లేరే!" అన్నాడు. 
          "దేవుడు అన్నిచోట్లా ఉంటాడు, మనం చేసే పనులు చూస్తుంటాడని చెప్పావు కదా నాన్నా! మరి ఇప్పుడు నువ్వు చేస్తున్న పనిని కూడా దేవుడు చూస్తాడు కదా!" అన్నాడు కిష్టయ్య. 
          కొడుకు మాటలు విని సిగ్గుతో తల దించుకున్నాడు. దొంగతనం విరమించుకొని, కొడుకుని తీసుకోని ఇంటిముఖం పట్టాడు. ఆనాటి నుంచి భూపతి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమిస్తూ నిజాయితీగా జీవించసాగాడు. 

          ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన ధర్మం ఏమి అనగా దొంగతనం చేయకుండా ఉండటమే ధర్మం. పరిస్థితులు అలా వచ్చాయి అందుకే ఈ విధంగా చేయకతప్పలేదు అని సాకులు చెప్పేవారు ఉంటారు. కానీ ఎన్ని పరిస్థితులు వచ్చిన వాటిని ఎదుర్కొని నిలబడినవాడే ధర్మాన్ని పాటించినవాడు అవుతాడు. ఇలా పాటించడాన్నే ధర్మాన్ని రక్షించడం అంటారు. 

          ఈ ఒక్కసారే ఇలా చేయవల్సివచ్చింది, నేను రోజు పూజలు చేసే ఆ దేవుడే రక్షిస్తాడు అని అనుకుంటారు. కానీ ధర్మం విషయంలో ఏ దేవుడుతో సంబంధం ఉండదు. ఈ కథలో దేవుడు చూస్తున్నాడు అని ఉంది. ఎందుకంటే దేవుడు అని అంటేనే వినేవారు ఉన్నారు ఇప్పటి సమాజంలో. కానీ దేవుడ్ని నమ్మిన నమ్మకపోయినా ధర్మం చేసే పని చేస్తుంటుంది, అదే ప్రకృతి. మనం చేసే ధర్మ, అధర్మ కర్మలకు కర్మ ఫలం ఇస్తుంటుంది. దేవుడున్నాడని నమ్మడమే ధర్మం కాదు. ధర్మం యొక్క మౌలిక నియమాలను పాటించడమే ధర్మ బద్దంగా జీవించడం. 

          ఈ కథలో దొంగతనం కాకుండా ఇంకొక నిగూడ విషయం ఉంది. అది ఏమిటంటే ఇతరులకు నీతులు చెప్పి తను మాత్రం పాటించకపోవడం. ఇది కూడా అధర్మ క్రియ క్రిందికే వస్తుంది. అందుకే జాగ్రత్తగా అడుగులువేయండి. ముఖ్యంగా పిల్లలకు బోధించే సమయంలో కేవలం నీతులు బోధిస్తే సరిపోదు, వాటిని ఆచరణలో చూపాలి. అప్పుడే పిల్లలు సరైన మార్గంలో నడవగలుగుతారు. 

          ఈ కథ యొక్క వీడియో చూడండి.




మరిన్ని వీడియోల కోసం KUSUMA Creations Youtube Channel ను Subscribe చేసుకోండి. 

KUSUMA Creations YouTube channel is a part of Bharatsahajavaani.
 
KUSUMA Creations YouTube channel is an online Bharat Sahaja Vaani of Dhamma Marg education platform, specialized in what is the dharma, Spiritual Gurus introduction, Spiritual right path and Health tips  

       
 ఈ వీడియో మీకు నచ్చినదని భావిస్తూ... 

భవతు సర్వ మంగళం 

ఇవి కూడా చదవండి... 

 

కామెంట్‌లు